||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- అరువది నాలుగొవ సర్గ||

||"నియతాం అక్షతాం దేవీం"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చతుష్షష్టితమస్సర్గః||

తత్త్వదీపిక
అరువది నాలుగొవ సర్గ
"నియతాం అక్షతా దేవీం"

"నియతాం అక్షతామ్ దేవీం"
"నియతాం" అంటే నియమబద్ధురాలైన,
అంటే తన శీలము కాపాడుకున్న అని.
"అక్షతామ్" అంటే క్షీణించకుండా క్షేమముగావున్నఅని.

అంటే సీతమ్మ తన శీలముతో క్షేమముగా వున్నది అన్నమాట.
ఇది హనుమ మాట.
రాములవారికి చెప్పిన మాట.
హనుమ ఆ మూడు మాటలలో అతి ముఖ్యమైన మాట చెపుతాడు.
జీవిస్తున్న సీతను చూచాను అంటే,
ఆ సీత రామునికొఱకే వుందా అన్నమాట గురించి మళ్ళీ విశదీకరించాలి.
పతివ్రత అయిన సీతను చూశాను అంటే అమె జీవిస్తోంది అని ధ్వని కూడా వుంది.
హనుమ చెప్పిన మాట సందేహానికి తావు లేకుండా చెప్పిన మాట.

అదే ఈ సర్గలో ముఖ్యమైన మాట.
నిజానికి అది ఈ సర్గలోనే కాదు సుందరకాండలోనే ముఖ్యమైన మాట.

"తతో రావణ నీతాయాః " అంటూ సీతాన్వేషణ కి
హనుమ బయలుదేరినప్పుటినుంచి
రామలక్ష్మణ సుగ్రీవులతో సహ అందరూ వేచి వున్నది ఈ మాట కొఱకే.

హనుమ ఈ మాట రాములవారికి చెప్పి తన జన్మ సార్ధకము చేసుకున్నాడు.
ఆ హనుమ చెప్పిన మాట "అమృతోపమం",
అంటే అమృతముతో సమానమైన మాట.

ఈ మాట విన్న రామలక్ష్మణులు సంతోషము గురించి ఇలా వింటాము.
"బహుమానేన మహతా హనుమంత మవైక్షతా"
రాములవారు హనుమంతుని
ఆదరభావముతో నిండిన కళ్ళతో చూశాడుట.

ఇంకో మాట.

హనుమ వానరులకు లంకలో జరిగినది చెప్పేముందు,
సీత వుండే దిశలో నమస్కరించి మరీ మొదలెడతాడు.

అలాగ సుందరకాండ పారాయణచేసేవారు ఈ పాదము అంటే
"నియతాం ఆక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్" చదివినప్పుడు,
ఒక్కమారు మనస్సులో నైనా ప్రత్యక్షముగా నైనా
పరమాత్ముడికి నమస్కారము చెప్పుకుంటారు.
ఇది ఒక ముఖ్యమైన మాట.

ఇక వాల్మీకి రాసిన విధముగా ఈ సర్గని చదువుతాము.

వానరులు మధువనమును ధ్వంసము చేశారని వినిన సుగ్రీవుడు ,
సీతాన్వేషణ విజయవంతమైనది అని ఊహిస్తాడు.
అలాగ ఊహించిన సుగ్రీవుడు ఆనందభరితుడై,
దధిముఖుని తో వారినందరిని వెంటనే కిష్కింధకు పంపమని చెపుతాడు.

ఆ విధముగా సుగ్రీవునిచేత చెప్ప బడిన దధిముఖుడు,
రామలక్ష్మణులకు సుగ్రీవునకు ప్రణమిల్లి,
తన సహచరులగు ఇతర వానరులతో కలిసి ఆకాశములోకి ఎగిరెను.

అప్పుడు అతడు పూర్వము ఏ విధముగా వచ్చాడో అలాగే వెళ్ళి ,
ఆకాశమునుండి భూమి మీద దిగి ఆ మధువనమును ప్రవేశించెను.
దధిముఖుడు మధువనము ప్రవేశించి,
మత్తుతొలగి మధూదకము పోగా లేచివున్నవానర గణములను చూచెను.
మధువనము లో వీరుడైన అంగదునకు చేతులు జోడించి
నమ్రతతో మృదువైన మాటలతో దధిముఖుడు ఇట్లు పలికెను.

"ఓ సౌమ్యుడా నీకు రోషము వలదు.
రక్షకులచేత అడ్డగించబడడము
అజ్ఞానము వలన, క్రోధము వలన జరిగినది.
ఓ మహాబలుడా నీవు యువరాజువు.
ఈ వనమునకు అధిపతివి.
మూర్ఖత్వముతో పూర్వము చేసిన దోషమును క్షమించుటకు నీవే తగినవాడవు".

"ఓ అనఘా ! నేను వెళ్ళి నీ పినతండ్రికి
ఈ వానరులందరూ ఇక్కడికి వచ్చితిరని చెప్పితిని.
అతడు మీ ఆగమనము విని సంతోషభరితుడాయెను.

నీ పినతండ్రి వానరేశ్వరుడు అగు సుగ్రీవుడు
ఈ వనము ధ్వంసము అయినది అని విని కోపగించుకోలేదు.
మీ అందరినీ శీఘ్రముగా అక్కడికి పంపమని ఆ రాజు నాతో చెప్పెను."

దధిముఖుని చేత నమ్రతతో పలుకబడిన మాటలను విని,
వాక్య విశారదుడైన వానరశేష్ఠుడు అగు అంగదుడు
ఇతర వానరులతో ఇట్లు పలికెను.

" శత్రువులను తపింపచేయు వానర వీరులారా !
ఈ వృత్తాంతము అంతా రామునిచే వినబడెను.
ఆ కార్యము చేసి మనము ఇక్కడ వుండిపోవడము తగినది కాదు".

"ఓ వనచరులారా ! కావలిసినట్లు మధువును తాగి
విశ్రాంతి తీసు కొనిన మనకి మిగిలినది కార్యము ఏమి?
నా గురువు సుగ్రీవుడు ఎక్కడవుండునో అక్కడికి వెంటనే పోయెదము".

"వానరయోధులారా మీరు అందరూ కలిసి
మనకర్తవ్యము గురించి నాకు ఏమి చెప్పెదరో
నేను ఆదే విధముగా చేసెదను".

"నేను మీ అధీనములో ఉన్నవాడిని.
నేను యువరాజునే.
కాని కృతకృత్యులైన మిమ్మలను ఆజ్ఞాపించుటకు తగినవాడను కాను.
నాచేత మీరు ఆజ్ఞాపించబడుట యుక్తము కాదు".

ఈ విధముగా చెప్పబడిన అంగదుని
అవ్యయమైన మాటలను విని
ఆ వానరులందరూ సంతోషపడినవారై ఈ వాక్యములను చెప్పిరి".

" ఓ వానరోత్తమా! రాజా ! ఇటువంటి మాటలు ఎవరు చెప్పెదరు?
ప్రభువులు ఐశ్వర్య మదమత్తముతో సర్వము తామే అని భావిస్తారు.
ఈ వాక్యములు నీకే తగును ,ఇంకెవరూ ఇలా చెప్పలేరు.
నీ నమ్రత భవిష్యత్తులో కలుగు శుభయోగమును సూచించున్నవి".

"మేము అందరము వానరుల అధిపతి సుగ్రీవుడు వున్న చోటుకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాము.
ఓ వానరోత్తమా నీచేత ఆదేశించ బడకుండా
ఈ వానరులకు ఒక్క అడుగుకూడా ముందుకు వేయుటకు శక్యము కాదు.
నీకు సత్యముగా చెప్పుచున్నాము" అని.

వానరులు ఈ విధముగా పలుకగానే
అంగదుడు వెంటనే బయలుదేరుదాము అని వారికి చెప్పెను.
ఇలా చెప్పి ఆ మహబలులు ఆకాశములోకి ఎగిరిరి.

అప్పుడు ఆకాశములో ఎగిరిన ఆ హరియూథపులు
యంత్రములోనుంచి విసరబడిన అచలమైన రాళ్లవలె
ఆకాశమును కప్పివేస్తూ ఆకాశములోకి లేచిరి.

వేగవంతులైన ఆ వానరప్లవంగములు ఆకాశములోకి లేచి
నీటితో నిండిన మేఘములవలె మహానాదము చేసిరి.

అంగదుడు ప్రశ్రవణ పర్వతము సమీపించు ముందర
ఆ వానరాధిపుడు అగు సుగ్రీవుడు
శోకములో మునిగియున్న రామునితో ఇట్లు పలికెను.

"దుఃఖమునుంచి తేరుకొనుము.
నీకు శుభము అగు గాక.
దేవి చూడబడినది. సంశయము లేదు".

"అట్లు కానిచో గడువు దాటిన ఈ సమయములో
వానరులకు ఇక్కడికి రావడము అశక్యము.
యువరాజు మహాబాహువులు కలవాడు వానరశ్రేష్ఠుడూ అయిన అంగదుడు
కార్యము సాధించకుండా నాముందుకు రాడు".

"కృతకృత్యులు కానివారు అయినచో ,
వారు ఈ విధముగా వుండరు.
ఆ అంగదుడు దీనవదనముతో భ్రాంత చిత్తుడై వుండును".

"ఆ ప్లవగేశ్వరుడు సంతోషము లేని వాడు అయితే
పితృలు పితామహులచే పూర్వము రక్షించ బడిన
ఆ మధువనమును ధ్వంసము చేయడు".

"ఓ కౌసల్యాదేవికి ఆనందము కలిగించు రామా
కనుక ఊరడిల్లుము.
దేవి చూడబడినది.
అందులో సందేహము లేదు.
ఇంకెవరిచేతనో కాదు.
హనుమంతునిచేతనే".

"ఈ పని సాధించుటకు కారణము హనుమంతుడే.
ఓ మతిసత్తమా! సూర్యునిలో తేజము వలె
హనుమంతునిలో కార్యదక్షత బుద్ధి
నిరంతరము ప్రయత్నము చేయగల సామర్థ్యము,
పరాక్రమము వెలిసి ఉన్నాయి.
ఓ అమితమైన పరాక్రమము కలవాడా చింతా యుక్తుడవు కాకుము."

అప్పుడు హనుమంతుడు సాధించిన దుస్సాధ్యమైన కార్యమునకు గర్వించి ,
తమ కార్యసిద్ధిని ప్రకటిస్తున్నారా అన్నట్లు
కిష్కింధకు చేరుతున్నవానరుల కిలకిలారావములు
ఆకాశములో మారుమోగుతున్న శబ్దము వినవచ్చెను.

అప్పుడు ఆ కపిసత్తముడు వానరులయొక్క ఆ నినాదము విని
తన తోకను నిటారుగా ఎత్తి సంతోషముతో నిండిన మనస్సు కలవాడయ్యెను.
ఆ వానరులు అంగదుని హనుమంతుని ముందర ఉంచుకొని
రామదర్శన కాంక్షతో అచటికి చేరిరి.
అంగదప్రముఖులు వీరులు సంతోషముతో
వానరాధిపతి కి రాఘవునకు సమీపములో దిగిరి.

అప్పుడు మహాబాహువులు కల హనుమంతుడు నమస్కరించి
" దేవి నియమబద్ధురాలై క్షేమముగా ఉన్నది" అని రాఘవునకు నివేదించెను.

లక్ష్మణునితో కూడిన రాముడు హనుమంతుని వదనమునుండి
అమృతము తో సమానమైన "సీతను చూచితిమి "
అన్న మాటలను విని ఆనంద భరితులైరి.

అప్పుడు లక్ష్మణుడు ఆ పవనాత్మజునిపై నమ్మకము చూపిన
సుగ్రీవుని అతి గౌరవముతో చూచెను.

అప్పుడు శత్రువీరసంహారకుడైన రాముడు
అమితమైన ఆనందములో ఓలలాడుతూ
అత్యంత ఆదరభావముతో హనుమంతుని సాదరముగా చూచెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది నాలుగవ సర్గ సమాప్తము

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||